
చంద్రయాన్ సక్సెస్ తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు మరో కీలక ప్రయోగానికి సిద్దమవుతున్నారు. అంతరిక్షంలోకి మనుషులను పంపించేందుకు గగన్యాన్ ప్రాజెక్టును ఇస్రో చేపడుతున్న విషయం తెలిసిందే. ఇస్రో చరిత్రలోనే అత్యంత కీలకమైన ప్రయోగంగా ఇది నిలవనుంది. దీనికి సంబంధించి ఈ నెల 21న ఇస్రో కీలక టెస్ట్ నిర్వహించనుంది. ఆ రోజున క్రూ మాడ్యుల్ టెస్ట్ జరపనున్నట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు ఉండటానికి ఈ క్రూ మాడ్యూల్ ఉపయోగపడుతుంది.
ఈ క్రూ మాడ్యూల్ను అంతరిక్షంలోకి పంపించి, ఆ తర్వాత అ్కడ నుంచి బంగాళాఖాతంలో ల్యాండ్ చేయనున్నారు. శ్రీహరికోట నుంచి ఈ క్రూ మాడ్యుల్ టెస్ట్ను పరీక్షించనున్నారు. ఈ టెస్ట్ కోసం ఇప్పటికే గగన్యాన్ టెస్ట్ వెహికల్ అబోర్ట్ మిషన్-1 టీవీ డీ1 మాడ్యూల్ను లాంచింగ్ కాంప్లెక్స్కు చేర్చారు. ఈ ఏడాది ఏప్రిల్లో గగన్యాన్ ప్రయోగానికి సంబంధించిన కీలక టెస్ట్ను ఇస్రో పూర్తి చేసింది. ఇప్పుడు మరో కీలక టెస్ట్ను పరీక్షిస్తున్నారు.అయితే 2022లో గగన్యాన్ ప్రాజెక్టును ఇస్రో చేపట్టాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ ప్రయోగం ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి ఇస్రో పంపనుంది. వారితో పాటు ఒక మహిళా రోబోను కూడా పంపించనుంది.





