
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి జులై నెల కోటాను ఏప్రిల్ 20న ఉదయం 10 గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 22న ఉదయం 10గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్లో టికెట్లు మంజూరు చేస్తారు. టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్ల కోటాను ఈనె 20వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. మే, జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఏప్రిల్ 25న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటా…
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జులై నెల ఆన్లైన్ కోటాను ఏప్రిల్ 20వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు తితిదే విడుదల చేయనుంది. జులై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈనెల 21న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈనెల 21న మధ్యాహ్నం 3గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
ఏప్రిల్ 24న వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించి మే నెల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10గంటలకు, జూన్ నెల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 26న ఉదయం 10గంటలకు, తిరుపతిలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 27న ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని తితిదే ఒక ప్రకటనలో తెలిపింది.




