News

వేర్పాటువాదులకు భద్రత తొలగిస్తూ గవర్నర్ నిర్ణయం: పుల్వామా దాడి పక్కా ప్లాన్‌తోనే

1.4kviews

శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లో పుల్వామా దాడి నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ సింగ్.. వేర్పాటువాదులకు భద్రతను ఉపసంహరిస్తూ ఆదివారం (ఫిబ్రవరి 17) నిర్ణయం తీసుకున్నారు. జమ్ము కాశ్మీర్ గవర్నర్, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నాయి.

మొత్తంగా ఐదుగురు వేర్పాటువాదులకు భద్రతను ఉపసంహరించారు. ఇందులో మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, అబ్దుల్ ఘనీ భట్, బిలాల్ లోనే, హషీమ్ ఖురేషి, షబ్బీర్ షాలు ఉన్నారు. ఫరూక్ హురియత్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు. అలాగే, ఆవామా యాక్షన్ కమిటీకి ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్నాడు. వారికి భద్రతను ఉపసంహరించిన నేపథ్యంలో.. వారికి ఈ రోజు సాయంత్రం నుంచి ప్రభుత్వ వాహనం ఉండదు. ఎలాంటి సెక్యూరిటీ కవర్ ఉండదు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న వెసులుబాట్లు అన్ని కూడా రద్దు చేసినట్లు.

పక్కా ప్లాన్‌తో దాడి:

ఇదిలా ఉండగా, పక్కా ప్లాన్ ప్రకారమే పుల్వామా దాడి జరిగింది. కొందరితో అనుకొని చేసిన దాడి ఏమాత్రం కాదని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. సీఆర్పీఎఫ్‌కు చెందిన 78 వాహనాల కాన్వాయ్ ఆ రోడ్డు వెంట ప్రయాణిస్తోందంటే ఆ మార్గంలో భద్రత కూడా కట్టుదిట్టంగా ఉంటుంది. దళాలు వచ్చే సమయం తెలుసుకొన్న ఉగ్రవాదులు అంతకుముందే రెక్కీ నిర్వహించారని చెబుతున్నారు. సాధారణంగా సీఆర్పీఎప్ కాన్వాయ్‌లో అన్ని వాహనాలు ఉండవని చెబుతున్నారు. కానీ అందుకు మూడురెట్లకు పైగా వాహనాలతో వస్తున్న కాన్వాయ్‌కు భారీగా భద్రత ఉంటుంది. ఇలాంటి సమయంలో రోడ్డు ఓపెనింగ్‌ పార్టీస్‌(ఆర్‌వోపీ)లు కంటికి రెప్పలా కాపాడుతాయి. రోడ్లను ఎప్పటికప్పుడు క్లియర్‌ చేస్తాయి.

ఇలా దాడి:

అదే సమయంలో కాన్వాయ్‌ వెనుక వైపు కూడా భద్రత కల్పిస్తాయి. ఈ క్రమంలో పేలుడు పదార్థాలతో నిండిన ఎస్‌యూవీ కాన్వాయ్‌లో చొరబడే అవకాశం లేదని అంటున్నారు. ఒకవేళ కాన్వాయ్‌ను అనుసరించినా రోడ్డు ఓపెనింగ్ పార్టీలు అప్రమత్తమవుతాయి. ఈ విషయం తెలిసిన టెర్రరిస్టులు ఫిదాయిని ఒక కల్వర్టు పక్క నుంచి కాన్వాయ్‌కి ఎడమవైపు ప్రవేశపెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఈ కారు వేగంగా వెళ్తున్న కాన్వాయ్‌ వెంట కి.మీ. లేదా అర కి.మీ. మాత్రమే ప్రయాణించే అవకాశముంటుంది. అంతకు మించి అయితే రోడ్డు ఓపెనింగ్ పార్టీలు అప్రమత్తమవుతాయి. అందుకే, లక్ష్యంగా చేసుకొన్న బస్సు పక్కకు వచ్చిన వెంటనే ఎస్‌యూవీని సదరు ఉగ్రవాది పేల్చాడు.

బస్సును లక్ష్యంగా చేసుకొని టార్గెట్:

జవాన్ల కాన్వాయ్ పైన దాడి చేసేందుకు వ్యూహాత్మకంగా ఆ స్థానం ఎంచుకున్నారని భావిస్తున్నారు. జమ్ము శ్రీనగర్‌ రహదారిలో లెత్‌పోరా ప్రాంతంలో రహదారి వాలుగా ఉంటుంది. కాన్వాయ్‌ నిదానంగా వెళ్తుంది. దీనిని గుర్తించిన ఉగ్రవాది కాన్వాయ్‌లోని అయిదవ బస్సును లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి చేశాడు. ఈ ప్రదేశంలో ఎటువంటి సీసీ కెమేరాల్లేవు. దీనిని కూడా ఉగ్రవాదులు పసిగట్టి ఉంటారని భావిస్తున్నారు.

ఇలాంటి వాహనాలను ఆపడం కష్టం:

పుల్వామా దాడికి ఉపయోగించింది.. వెహకల్‌ బర్న్‌ ఐఈడీ (వీబీఐఈడీ)గా చెబుతున్నారు. ఇలాంటి వాటిని గుర్తించడం కష్టమట. పేలుడు పదార్థాలను వైర్లతో అనుసంధానం చేసి, పేల్చే విధంగా సిద్ధం చేస్తారు. కాశ్మీర్‌లో మరిన్ని కారు బాంబులు ఉండే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కదులుతున్న కారు బాంబులను గుర్తించినా వాటిని ఆపటం కష్టం. ఎందుకంటే ఆ వాహనాన్ని ఆపినా బాంబు యాక్టివేట్ అయి పేలిపోయేలా ఉంటుందట. ఒకసారి అలాంటి బాంబు అమర్చిన కారులోకి ప్రవేశించారంటే కచ్చితంగా పేల్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.

Source: One India

Read more at: https://telugu.oneindia.com/news/india/security-cover-all-kashmiri-separatist-leaders-including-hurriyat-founder-withdrawn/articlecontent-pf209381-239306.html