News

నిజాం 5 వేల కేజీల బంగారం విరాళం ప్రచారం.. RTIతో పటాపంచలు

2views

పాకిస్తాన్‌తో 1965లో జరిగిన యుద్ధం తర్వాత హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జాతీయ రక్షణ నిధికి (National Defence Fund) 5,000 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారనే ప్రచారం తప్పు అని సమాచార హక్కు చట్టం (RTI) కింద దాఖలైన దరఖాస్తులు తేల్చాయి. ఒక రిపోర్టర్ దాఖలు చేసిన RTIకి జాతీయ రక్షణ నిధిని పర్యవేక్షించే ప్రధానమంత్రి కార్యాలయం (PMO) సమాధానమిస్తూ.. అటువంటి విరాళానికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఏదీ లేదని స్పష్టం చేసింది.

ప్రచారంలో ఉన్న ఒక కథనం ప్రకారం… 1965 నాటి యుద్ధం తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు నిధుల సేకరణ కోసం హైదరాబాద్‌కు వచ్చిన అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 5,000 కిలోల బంగారాన్ని ఇచ్చారని ప్రచారం ఉంది. బంగారం ఇచ్చిన తర్వాత, నిజాం ఆ బంగారాన్ని తెచ్చిన పెట్టెలను మాత్రమే తనకు తిరిగి ఇవ్వాలని కోరారనే కథలు ప్రచారంలో ఉండేవి.
అయితే అసలు నిజమేమిటంటే… నాటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అక్టోబర్ 1965లో 6.5% ఉచిత వడ్డీ రేటుతో ప్రారంభించిన “నేషనల్ డిఫెన్స్ గోల్డ్ స్కీమ్” (National Defence Gold Scheme)లో నిజాం 4.25 లక్షల గ్రాముల (425 కిలోలు) బంగారాన్ని పెట్టుబడిగా (ఇన్వెస్ట్‌మెంట్) పెట్టారు తప్ప విరాళంగా ఇవ్వలేదు.

‘ది హిందూ’ కథనం

డిసెంబర్ 11, 1965 నాటి ‘ది హిందూ’ పత్రిక కథనం గోల్డ్ బాండ్ల విషయానికి సంబంధించి కింది సమాచారాన్ని ధృవీకరిస్తోంది:

ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చినప్పుడు, వయోవృద్ధుడైన మాజీ పాలకుడు (నిజాం) ఆయనకు స్వాగతం పలికారు. ఆ రోజు సాయంత్రం జరిగిన బహిరంగ సభలో శాస్త్రి గారు మాట్లాడుతూ… గోల్డ్ బాండ్లలో (Gold Bonds) దాదాపు ₹50 లక్షల విలువైన 4.25 లక్షల గ్రాముల బంగారాన్ని పెట్టుబడి పెట్టినందుకు నిజాంను అభినందించారు. ఈ పెట్టుబడిలో పురాతన బంగారు నాణాలు (Gold Mohors) కూడా ఉన్నాయని, వాటి ప్రాచీనత ఆధారంగా వాటి విలువ మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. “మేము ఈ బంగారు నాణాలను కరిగించకుండా, విదేశాలకు పంపి మరింత ఎక్కువ విలువను పొందాలనుకుంటున్నాం. దీని ద్వారా దాదాపు ఒక కోటి రూపాయలు రావచ్చు” అని శాస్త్రి పేర్కొన్నారు.
అలాగే, అదే కథనంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నుంచి 1.25 లక్షల గ్రాముల బంగారం విరాళం, తెలుగు సినీ నటుల నుంచి ₹8 లక్షల నగదు విరాళంగా ప్రభుత్వానికి వచ్చినట్లు పేర్కొనడం జరిగింది.

అప్రకటిత ఆదాయానికి మినహాయింపు

అక్టోబర్ 1965 నాటి నేషనల్ డిఫెన్స్ గోల్డ్ బాండ్లు ఒక ‘అమ్నెస్టీ స్కీమ్’ (క్షమాభిక్ష పథకం) లాగా పనిచేశాయి.
ప్రభుత్వం విడుదల చేసిన విలేకరుల ప్రకటన ప్రకారం:

“గోల్డ్ బాండ్లలో జమ చేసే బంగారానికి గోల్డ్ కంట్రోల్ లేదా కస్టమ్స్ నిబంధనలు వర్తించవు, ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోబడవు. ఆదాయపు పన్ను చట్టం కింద వెల్లడించని ఆదాయం నుండి ఈ బంగారాన్ని పొందినా… ఆ ఆదాయం లేదా ఆస్తులపై పన్ను విధింపు చర్యలు ఉండవు.”

లబ్ధిదారు ఎవరు?

నిజాం పెట్టిన పెట్టుబడి ఒక తెలివైన చర్య అయినప్పటికీ, ఆ పెట్టుబడి ద్వారా వచ్చిన లబ్ధిదారు ఎవరు అనే విషయం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. RTI చట్టంలోని సెక్షన్ 8(1)(j) – “వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అంశం” అని పేర్కొంటూ భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ పెట్టుబడి, దాని తుది లబ్ధిదారుకి సంబంధించిన RTI దరఖాస్తును తోసిపుచ్చింది.

నిజాం మనవళ్ళలో ఒకరైన నజఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ, ఈ చెల్లింపు గురించి తనకు తెలియదని అన్నారు. “ఇది నాకు కొత్త విషయం. దీనిని ఎవరు క్లెయిమ్ చేశారో నాకు తెలియదు. నిజాం 52 ట్రస్టులను ఏర్పాటు చేశారు, ఏ ట్రస్ట్ ఈ డబ్బును అందుకుందో నాకు తెలియదు” అని ఆయన చెప్పారు.

(సౌజన్యం: ది హిందూ)