
దేశమంతా మార్మోగిన నినాదం జైశ్రీరామ్ నామ మంత్రమని, సంగీత పితామహుడు త్యాగరాజు 95 కోట్ల నారాయణ జపం చేసి సీతారామచంద్రుల దర్శనం పొందిన భాగవత ఉత్తముడని మహా సహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని త్యాగరాజ భవనంలో జరుగుతున్న త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో భాగంగా రామాయణంపై ఆయన ప్రవచనం గావించారు. శ్రీరామ దర్శనం పొంది భగవంతుడున్నాడన్న సత్యాన్ని చాటిన నిష్కర్మయోగి అని, తెలుగు భాష తీయదనాన్ని, సాహితీ పరిమళాలను విశ్వవ్యాప్తం చేసిన ధన్యజీవి అని, మోక్ష సాధన మార్గాల్లో సంగీతం ఒకటని తలచి తన సంకీర్తనల ద్వారా భగవంత చేరువై మోక్ష ప్రాప్తి పొందిన మహనీయులు త్యాగరాజ స్వామి అని అన్నారు. తొలుత చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పులఖండం కోటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో ఉద్దరాజు కాశీ విశ్వనాఽథరాజు, డాక్టర్ గంధం విశ్వేశ్వరరావు, వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, వబిలిశెట్టి కనకరాజు ఉన్నారు.




