News

పాక్‌ కోసం గూఢచర్యం.. లాయర్‌ రిజ్వాన్‌ అరెస్ట్‌

153views

పాక్‌ కోసం గూఢచర్యం వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు భారతీయులు అరెస్టైన విషయం తెలిసిందే. హర్యానా, పంజాబ్‌, యూపీలో అనేకమంది గుఢచారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఓ లాయర్‌ అరెస్టయ్యాడు.

పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐకు గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలపై హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన న్యాయవాది రిజ్వాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడు డబ్బులు తీసుకోవడానికి ఏడుసార్లు అమృత్‌సర్ వెళ్లినట్లు తేలింది. ఈ విషయం పోలీసుల అదుపులో ఉన్న రిజ్వాన్‌ స్నేహితుడు ముషారఫ్ అలియాస్ పర్వేజ్‌ ద్వారా తేలింది. మూడేళ్ల క్రితం సోహ్నా కోర్టులో రిజ్వాన్‌, ముషారఫ్‌కు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారిద్దరూ మంచి స్నేహతులయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ వృత్తిరీత్యా వేరువేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. ముషారఫ్‌ ప్రాక్టీస్‌ కోసం నుహ్‌ కోర్టుకు వెళ్లగా.. రిజ్వాన్‌ గురుగ్రామ్‌ కోర్టుకు వెళ్లాడు. అయినప్పటికీ తరచూ కలుసుకునే వాళ్లు.

అయితే, రిజ్వాన్‌ తరచూ అమృత్‌సర్‌ వెళ్లేవాడని ముషారఫ్‌ పోలీసులకు తెలిపాడు. ఈ జులైలో అతడితో కలిసి తాను కూడా అమృత్‌సర్‌ వెళ్లినట్లు చెప్పాడు. అప్పుడు వాఘా సరిహద్దు వద్ద బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక బ్యాగ్‌లో రిజ్వాన్‌కు డబ్బులు ఇచ్చారని తెలిపాడు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో తనకు తెలియదని దర్యాప్తు సందర్భంగా పోలీసులకు చెప్పాడు. కాగా, ముషారఫ్‌ ఇచ్చిన ఆధారాలతో అధికారులు దర్యాప్తు చేయగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌, ఇండస్ఇండ్ బ్యాంక్‌ల్లో రిజ్వాన్‌కు ఖాతాలు ఉన్నట్లు వెల్లడైంది. అయితే, లావాదేవీల పరిమితి దాటడంతో పంజాబ్ నేషనల్‌ బ్యాంక్ ఖాతా మూత పడినట్లు అధికారులు గుర్తించారు.