
దేవతల రాజధాని ఎలా ఉంటుందో.. అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం రైతులు 33వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, పవిత్ర కార్యక్రమానికి రైతులు సహకరించారని అభినందించారు. అమరావతిలోని వెంకటపాలెంలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు గురువారం భూమిపూజ చేశారు. రూ.260 కోట్లతో రెండు దశల్లో పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, ఆంజనేయస్వామి ఆలయాలు నిర్మించనున్నారు. మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు.
మొదటి దశలో రూ.140 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారాన్ని నిర్మిస్తారు. రూ.48 కోట్లతో ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, వాహన మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. రెండో దశలో శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్రోడ్డు, అన్నదానం కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలన భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనుల్ని చేపడతారు. వీటికి రూ.120 కోట్ల వ్యయం కానుంది.





