
భారతీయ సమాజానికి రెండు కళ్లలాంటి దేశ, ధర్మాలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని శృంగేరిపీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతీస్వామి సూచించారు. ఆయన ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి నివాసంలో జరిగిన పాదపూజ అనంతరం అనుగ్రహభాషణ చేశారు. ‘ప్రజలు దేశాన్ని గౌరవించుకుంటూనే ధర్మాన్ని కాపాడుకోవాలి. వేల ఏళ్ల సనాతన చరిత్ర కలిగిన భారతదేశంలో పుట్టడం ఎన్నో జన్మల అదృష్టం. కష్టపడకుండా ఎవరికీ ఏదీ దక్కదు. ఆదిశంకరాచార్యులు తాను జీవించిన 32 ఏళ్లలోనే దేశంలో వేల సంవత్సరాలకు అవసరమైన ధర్మాన్ని జాగృతం చేశారు. దీన్ని అందరూ కలిసి ముందుకు తీసుకెళ్లాలి’ అని విధుశేఖర భారతీస్వామి పిలుపునిచ్చారు. అంతకుముందు జరిగిన పాదసేవలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు సర్బానంద్ సోనోవాల్, అన్నపూర్ణాదేవి, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్, సతీష్చంద్రదూబే తదితరులు పాల్గొన్నారు.





