
బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా విశాఖపట్నం రుషికొండలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ భవన్(టీసీఆర్టీఎం)లో ఉత్సాహంగా కార్నివాల్ జరిగింది. ముందుగా గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్.భార్గవి, కలెక్టర్ హరేందిర ప్రసాద్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
టీసీఆర్టీఎంలో గిరిజన స్వాతంత్య్ర పోరాటయోధుల చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించి, ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్నివాల్లో రాష్ట్రంలోని వివిధ ఐటీడీఏలకు చెందిన ఆదివాసీ కళాకారులు ప్రదర్శించిన థింసా, మయూరి, కొమ్ము, కోయ, సవర వంటి సంప్రదాయ గిరిజన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర పోరాటంలో గిరిజన వీరుల త్యాగాలను స్మృరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. ఇలాంటి ఉత్సవాల ద్వారా గిరిజన ప్రాంతాల సామాజిక–ఆర్థిక అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం, జాతీయ గౌరవాన్ని కాపాడటానికి రాబోయే తరాలను ప్రేరేపిస్తుందన్నారు. కార్యక్రమంలో ఈడీ డా.రాణిమందా, నాగరాజు చిక్కాల తదితరులు పాల్గొన్నారు.





