News

‘కుంబ్‌ మేళా’ వ్యర్థమన్నారు ?.. మరి హాలోవిన్‌ మాటేంటి ?’

48views

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీరుపై బీజేపీ మండిపడింది. ఇటీవల లాలూ తన కుటుంబ సభ్యులతో కలిసి హాలోవీన్ పండుగను జరుపుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. హిందూ మత విశ్వాసాలకు సంబంధించిన మహా కుంభ్ మేళాను నాడు అర్థరహితం అని అభివర్ణించిన లాలూ యాదవ్, ఇప్పుడు ఒక పాశ్చాత్య పండుగను ఆనందంగా జరుపుకోవడం ఏమిటని బీజేపీ నిలదీసింది.

లాలూ యాదవ్ కుమార్తె, ఆర్జేడీ మహిళా నేత రోహిణి ఆచార్య యాదవ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో హాలోవీన్ వేడుకల వీడియోలను పంచుకున్నారు. ‘అందరికీ హాలోవీన్ శుభాకాంక్షలు’ అని ఆమె ట్వీట్ చేశారు. ఆ వీడియోలలో లాలూ యాదవ్ తన మనవరాళ్లకు ఫోటోలు తీస్తూ కనిపించారు. ఈ వీడియో వైరల్‌ అయిన దరిమిలా.. లాలూ యాదవ్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, బీజేపీ కిసాన్ మోర్చా (బీజేపీకేఎం) ఘాటుగా స్పందించింది. ‘బీహార్ ప్రజలారా.. మర్చిపోవద్దు. నమ్మకం, ఆధ్యాత్మికతను వ్యర్థం అన్న లాలూ యాదవ్‌ ఇప్పుడు ఆంగ్లేయుల పండుగ హాలోవీన్ జరుపుకుంటున్నారని ‘ఎక్స్‌’లో పేర్కొంది.

ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లడంపై విలేకరులు ప్రశ్నించినప్పుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ‘కుంభ్‌కు అర్థం లేదు… అది అర్థరహితం’ అంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను అగౌరవపరిచేలా ఉన్నాయని బీహార్ బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ శర్మ అప్పట్లో విమర్శించారు.