
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బిరాంచిపుర్ గ్రామంలో వందేళ్ల నాటి గురుద్వారా ఉంది. గ్రామమంతా హిందువులు నివసిస్తున్న చోట ఈ గురుద్వారా ఏర్పాటుకు గ్రామ భూస్వామి దీనబంధు సాహు ఎకరం నేలను విరాళంగా ఇవ్వడంతో 1919లో దీనిని నిర్మించారు. ఈ గ్రామస్థులు గురునానక్ను ‘గడీ ఠాకుర్’ అని పిలుస్తారు. ఇళ్లలో హిందూ దేవతలను పూజించే తాము ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గురుద్వారాలో ప్రార్థనలు చేస్తామని కైలాశ్ పాణిగ్రాహి తెలిపారు. బెల్లం, నెయ్యితో నైవేద్యం పెట్టి.. తులసితో బ్రాహ్మణులు నిత్య పూజలు చేస్తారు. అంతేకాదు.. ఏ కార్యక్రమం మొదలుపెట్టాలన్నా గ్రామస్థులు ముందుగా ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తారు. ఏటా నిర్వహించే గురునానక్ జయంతికి భారీసంఖ్యలో జనం వస్తారు. ఆ సందర్భంగా ప్రత్యేక ‘లంగర్’ (అన్నదానం) ఉంటుంది. పంజాబ్ వంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా సిక్కులు బిరాంచిపుర్కు వస్తారు.





