
‘‘మీరు పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం ఏదో ఒకరోజు మిమ్మల్నే కాటేస్తుంది.. ఉగ్రవాదాన్ని ఆయుధంగా మార్చుకుని మాపై గురి పెట్టారు. భవిష్యత్తులో మీరు చింతించాల్సిన రోజు వస్తుంది” అంటూ ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఎంపీ మరియం సొలైమాంఖిల్ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ను హెచ్చరించారు. ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాక్ జరిపిన వైమానిక దాడిలో ముగ్గురు దేశవాళీ క్రికెటర్లు సహా మొత్తం ఎనిమిది మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై మరియం స్పందిస్తూ.. పాక్ దాడిలో చిన్న పిల్లలు, మహిళలు చనిపోవడం తన హృదయాన్ని ముక్కలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత్ కు దగ్గరయ్యేందుకు ఆఫ్ఘనిస్థాన్ ప్రయత్నించిన ప్రతిసారీ పాకిస్థాన్ ఇలాగే దాడులు చేస్తోందని మరియం ఆరోపించారు. భారతీయులు, ఆఫ్ఘన్ల మధ్య శాంతి నెలకొనడం చూసి పాక్ ఓర్వలేదని ఆమె మండిపడ్డారు. ఆఫ్ఘన్ లోని ఉగ్రవాద క్యాంపులపై దాడులు చేస్తున్నామని చెబుతూ సామాన్యులపై బాంబులు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఒక్క ఉగ్రవాది మరణించినట్లు పాక్ చూపించలేకపోయిందని ఆమె ఆరోపించారు. పాక్ జరిపిన అమానుష దాడుల్లో ఎంతోమంది ఆఫ్ఘన్ పౌరులు, చిన్న పిల్లలు మరణించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయాన్ని మరియం గుర్తు చేశారు.