News

అదీనా మసీదు కాదు అది పురాతనమైన ఆదినాథ్ దేవాలయం

58views

భారత మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్టీ-ఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. మాల్దా జిల్లాలోని చారిత్రక అదినా మసీదుపై ఆయన చేసిన పోస్ట్‌తో పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చినట్లయింది…

“పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో ఉన్న అదినా మసీదు ఒక చారిత్రక కట్టడం. దీనిని 14వ శతాబ్దంలో ఇలియాస్ షాహీ వంశానికి చెందిన రెండో పాలకుడు సుల్తాన్ సికందర్ షా నిర్మించారు. 1373-1375 మధ్య కాలంలో నిర్మించిన ఈ మసీదు, అప్పట్లో భారత ఉపఖండంలోనే అతిపెద్దదిగా ఉండేది” అని పఠాన్ ఎక్స్ ద్వారా చేసిన ఒక పోస్టులో పేర్కొన్నారు.

ఇక ఈ పోస్టు చేసిన కొద్ది సేపటికే బీజేపీ బెంగాల్ శాఖ తీవ్రంగా స్పందించింది. అది అదీనా మసీదు ఎంతమాత్రమూ కాదని ఆదినాథ్ దేవాలయమని కౌంటర్ ఇచ్చింది. దీనికి సంబంధించి అనేక చారిత్రక ఆధారాలను తెలియజేస్తూ, ఒక హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి దానిపై ఈ కట్టడాన్ని నిర్మించారని యూసుఫ్ పఠాన్‌కు వారు సూచించారు.

అయతే అదినా మసీదు వివాదాలకు కేంద్రంగా నిలవడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది, వృందావన్‌కు చెందిన విశ్వవిద్యా ట్రస్ట్ అధ్యక్షుడు హిరణ్మోయ్ గోస్వామి నేతృత్వంలోని పూజారుల బృందం ఈ కట్టడంలోకి ప్రవేశించి హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించింది. కట్టడం లోపల హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని, ఇది ఒకప్పుడు ఆలయమేనని వారు వాదించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ ఘటన తర్వాత, భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) గోస్వామిపై కేసు నమోదు చేసింది.

ఈ వివాదం నేపథ్యంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ కట్టడాన్ని అధికారులు మూసివేశారు. భద్రతను కట్టుదిట్టం చేసి సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు, ఒక పోలీస్ చెక్‌పోస్ట్‌ను కూడా నెలకొల్పారు. తాజా పరిణామాలతో ఈ చారిత్రక కట్టడం మరోసారి వార్తల్లో నిలిచింది.