News

సాగర జలాల్లోకి యుద్ధ నౌక ‘ఆండ్రోత్‌’

31views

తీర ప్రాంతానికి చేరువలోని సాగరజలాల్లో శత్రు జలాంతర్గాముల ఉనికిని పట్టేసే యుద్ధనౌక ‘అండ్రోత్‌’ భారత నౌకాదళంలో చేరింది. విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రెండో ‘యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్’, ‘ఆండ్రోత్‌’ జలప్రవేశం చేసింది. నేవీ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధర్కర్ ఆధ్వర్యంలో దీన్ని కమిషనింగ్‌ చేశారు. భారత నౌకాదళం స్వదేశీకరణ ప్రయత్నాల్లో ఇది మరో మైలురాయిగా నిలిచింది.

కోల్‌కతాలోని ప్రభుత్వరంగ నౌకా నిర్మాణ సంస్థ గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ -జీఆర్‌ఎస్‌ఈ దీన్ని రూపొందించింది. ఈ శ్రేణిలో ఇది రెండో యుద్ధనౌక. మొదటిది ఐఎన్‌ఎస్‌ అర్నాలా. అది జూన్‌ 18న లాంఛనంగా భారత నౌకాదళంలో చేరింది. లక్షదీవుల్లోని అండ్రోత్‌ అనే దీవి పేరును రెండో యుద్ధనౌకకు ఖరారు చేశారు.

ఆండ్రోత్‌ యుద్ధ నౌకలో దేశీయంగా రూపొందించిన 30 ఎంఎం సర్ఫేస్‌ గన్‌ ఉంది. లోతు తక్కువగా ఉన్న జలాల్లోని జలాంతర్గాములను వేటాడే 16 అధునాతన నౌకలకు నేవీ ఆర్డర్‌ పెట్టింది. ఇందులో ఎనిమిదింటిని జీఆర్‌ఎస్‌ఈ ఉత్పత్తి చేస్తోంది. తీర ప్రాంతానికి చేరువలోని జలాలపై నిఘా వేసే సామర్థ్యం వీటికి ఉంది. విమానాలతో సమన్వయం చేసుకుంటూ శత్రు జలాంతర్గాములను వేటాడగలవు. అధునాతన పోరాట నిర్వహణ వ్యవస్థలు వీటి సొంతం. ఈ యుద్ధనౌకల్లో తేలికపాటి టోర్పిడోలు, జలాంతర్గామి విధ్వంసక రాకెట్లు ఉన్నాయి.