News

జమియత్ చీఫ్‌కి అస్సాం సీఎం వార్నింగ్..

205views

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆల్ ఇండియా జమియత్ ఉలేమా-ఇ-హింద్ అధ్యక్షుడు మహమూద్ మదానీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన సీఎం.. అసలు మదానీ ఎవరు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో మాత్రమే ఆయనకు ప్రాముఖ్యత లభించిందని అన్నారు. ‘‘మదానీ ఎవరు..? ఆయన దేవుడా..? మదానీ ధైర్యం అంతా కాంగ్రెస్ సమయంలో మాత్రమే, ఇప్పుడు కాదు. ఆయన పరిమితులు దాటితే జైలులో పెడతాను, నేను సీఎంను, మదానీ కాదు. నేను మదానీకి భయపడను’’ అని సీఎం హెచ్చరించారు.

జమియత్ నేతను అరెస్ట్ చేసి బంగ్లాదేశ్‌కు పంపిస్తానని అంతకుముందు హిమంత వ్యాఖ్యలు చేశారు. దీనికి మదానీ స్పందిస్తూ.. నేను నిన్నటి వరకు ఆయన రాష్ట్రంలోనే ఉన్నానని, ఆయన ప్రతీ ముస్లింను బంగ్లాదేశ్ కు పంపాలని చెబుతున్నారని, కాబట్టి ఈ దేశంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న వారు పాకిస్తాన్‌కి వెళ్లాలని అన్నారు. అస్సాం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆక్రమణల తొలగింపుపై మదానీ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నిర్దేశించిన నియమాలను పాటించాలని డిమాండ్ చేశారు.

మదానీ పర్యటనపై సీఎం స్పందిస్తూ.. ఎవరైనా భూమి ఆక్రమిస్తే ఏం జరుగుతుందో చూడటానికి ఆయనను అనుమతించామని అన్నారు. భూ సమస్యలపై బయటి వ్యక్తులు గ్రామస్తుల్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆక్రమణదారులు భూమిని ఆక్రమించేటప్పుడు గ్రామస్తులకు సమాచారం ఇవ్వరు, ఆ తర్వాత వారు నిందిస్తున్నారని, ఎవరికీ భయపడమని సీఎం అన్నారు. జమియత్ ఉలామా ఇ హింద్ ఆక్రమణలు తొలగించడాన్ని వ్యతిరేకిస్తోంది.