News

ఆస్తి తగాదాలతో తండ్రి, సవతి సోదరుడిని హత్య చేసిన మక్సూద్

229views

యూపీ రాష్ట్రం బరేలీ జిల్లా ఫరీద్‌పూర్ ప్రాంతంలోని నాదల్‌గంజ్ గ్రామంలో ఓ హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక కొడుకు తన భార్యతో కలిసి తన తండ్రి, సవతి సోదరుడిని దారుణంగా హత్య చేశాడు. దీనికి ఆస్తి తగాదాలే కారణమని చెబుతున్నారు. నిందితుడు తండ్రి, సోదరుడిని కారుతో తొక్కించి చంపాడు. భార్య భర్తను పక్కా ప్లాన్‌తో హత్య చేసేలా ఉసిగొలిపిందని తేలింది. ఈ ఘటన తర్వాత గ్రామంలోని అందరూ షాక్ అయ్యారు.

పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం, మక్సూద్ తన భార్య నూర్బానోతో కలిసి కారులో బయలుదేరాడు. దారిలో అతని తండ్రి హాజీ నాన్హే (61), సవతి సోదరుడు మిసార్యార్ ఖాన్ (33) బైక్‌పై ఫరీద్‌పూర్ వైపు వెళుతున్నారు. చందోఖా మలుపు సమీపంలో మక్సూద్ వారి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. వారిద్దరూ రోడ్డుపై పడిపోయిన వెంటనే, మక్సూద్ వారిపై కారును ఎక్కించాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం నిందితుడు మక్సూద్ ఇద్దరి మృతదేహాలను సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న గుంటలోకి నెట్టి కారులో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మక్సూద్ గత 6 నెలలుగా తన తండ్రి, సోదరుడిని అంతమొందించాలని ప్లాన్ చేస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నూర్బానోను అరెస్టు చేశారు. విచారణలో ఆమె నిజాన్ని ఒప్పుకుంది. ప్రస్తుతానికి నూర్బానోను జైలుకు తరలించారు. మక్సూద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ హత్య ఆస్తికోసంమే జరిగిందని.. భార్య నూర్బానో భర్త మక్సూద్‌ను హత్య చేసేందుకు ఉసిగొలిపిందని చెబుతున్నారు.