
తిరుమల తొలిగడప దేవునికడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 29 నుంచి నిర్వహించనున్నట్లు టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఈఓ చాంబర్లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఉత్సవాల్లో భాగంగా జనవరి 28న అంకురార్పణ జరుగుతుందన్నారు. జనవరి 29వ తేదీ ఉదయం 9.30 గంటలకు మీణ లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆయన వివరించారు. అలాగే ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం, ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగంతో కార్యక్రమాలు ముగుస్తాయన్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈఓలు నటేష్ బాబు, ప్రశాంతి తదితర అధికారులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు
29వ తేది ఉదయం ధ్వజారోహణం, రాత్రి చంద్రప్రభ వాహనం, 30న సూర్యప్రభ, పెద్దశేష వాహనం, 31న చిన్నశేష, సింహ వాహన సేవలు, ఫిబ్రవరి 1న కల్పవృక్ష, హనుమంత వాహన సేవలు, 2న ముత్యపుపందిరి, గరుడ వాహన సేవలు ఉంటాయి. 3న కల్యాణో త్సవం, గజవాహనం, 4న రథోత్సవం, 5న సర్వభూపాల, అశ్వవాహన సేవలు, 6న వసంతోత్సవం, చక్ర స్నానం,7న పుష్పయాగం ఉంటుందని వివరించారు.





