News

తమిళనాడు గడ్డ సిద్ధులకు, సాధు పుంగవులకు నెలవు: పవన్ కల్యాణ్

16views

ఇటీవల సనాతన ధర్మం అంశంలో తమిళనాడు సీఎం ఉదయనిధి స్టాలిన్ తో మాటల యుద్ధం రాజుకున్న నేపథ్యంలో… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమిళనాడుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇటీవల అన్నాడీఎంకే వ్యవస్థాపక దినోత్సవానికి ముందుస్తుగా శుభాకాంక్షలు తెలిపిన పవన్… తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో తన తండ్రి ప్రస్తావన కూడా తీసుకువచ్చారు.

“తమిళనాడు గడ్డ సిద్ధులకు, సాధు పుంగవులకు నెలవు. దివంగతులైన మా నాన్న గారు స్వామి రామకృష్ణ పరమహంస, శారదా మాత, స్వామి వివేకానందలను ఎంతగానో ఆరాధించేవారు. ఆయన అప్పట్లోనే రాంచీ వెళ్లి క్రియా యోగ దీక్ష చేపట్టారు. అంతేకాదు, మాకందరికీ కూడా ఆ క్రియా యోగను పరిచయం చేశారు.

80వ దశకం చివర్లో, 90వ దశకం ఆరంభంలో మా నాన్న చెన్నైలోని శాంథోమ్ వెళ్లి మహావతార్ బాబాజీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయన తరచుగా తిరువణ్ణామలై వెళ్లి యోగి రామ్ సూరత్ కుమార్ సేవలో పాల్గొనేవారు.

సంస్కృతి, భక్తి సంప్రదాయాల పరంగా తమిళనాడు నిజంగా పుణ్యభూమి అని చెప్పాలి. తమిళనాడు ఎంతోమంది సిద్ధులు, సాధువుల ఆశీస్సులతో పునీతమైంది” అని పవన్ కల్యాణ్ వివరించారు.