News

‘ముందు మీ దేశంలో మానవహక్కుల సంగతి చూసుకోండి’

18views

భారతదేశంలో మతస్వేచ్ఛ గురించి ‘యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం – యుఎస్‌సిఐఆర్ఎఫ్’ నివేదిక దురుద్దేశంతో కూడుకున్నదని విదేశాంగశాఖ మండిపడింది. ఆ సంస్థ పక్షపాత ధోరణితో, రాజకీయ అజెండాతో నడిచే సంస్థ అని విరుచుకుపడింది. భారతదేశం గురించి ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందంటూ ఆ సంస్థ నిజరూపాన్ని ప్రజలముందుంచింది.

‘‘అంతర్జాతీయ మతస్వేచ్ఛ గురించి యుఎస్ కమిషన్ (యుఎస్‌సిఐఆర్ఎఫ్) గురించి మా ఉద్దేశాలు సుస్పష్టం. అది రాజకీయ అజెండాతో పనిచేసే పక్షపాత వైఖరి కలిగిన సంస్థ. అది వాస్తవాలను తప్పుగా వ్యాఖ్యానించడం, భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఎప్పటికీ చేస్తూనే ఉంటుంది. ఆ సంస్థ దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన నివేదికను తిరస్కరిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు.

ఒక దేశం పరువు తీయాలనే దురుద్దేశంతో ప్రయత్నాలు చేయకుండా నిగ్రహించుకోవడం అలవాటు చేసుకోవాలని ఆ సంస్థను భారత విదేశాంగశాఖ కోరింది. అంతకంటె, అమెరికాలో మానవ హక్కుల సమస్యలను పరిష్కరించడం మీద దృష్టి కేంద్రీకరించడం మేలు అని సూచించింది.

యుఎస్‌సిఐఆర్ఎఫ్ తన నివేదికలో భారతదేశంలో మతస్వేచ్ఛకు ఆటంకాలు కలుగుతున్నాయని ఆరోపించింది. ‘‘2024లో ఎందరో వ్యక్తులు హత్యకు గురయ్యారు. కొన్ని సమూహాలు కొందరు వ్యక్తులను చితకబాది, సామూహిక హత్యలకు పాల్పడ్డారు. మతగురువులు ఏ కారణమూ లేకుండా అరెస్ట్ అయ్యారు. ప్రార్థనా స్థలాలు, ఇళ్ళు కూల్చేసారు. అటువంటి సంఘటనలు మతస్వేచ్ఛను పూర్తిగా ఉల్లంఘించాయి’’ అని ఆ నివేదిక పేర్కొంది.

‘‘ప్రభుత్వంలో ఉన్నవారు తప్పుడు సమాచారం, సమాచారం లేకపోవడం, ద్వేషపూరిత ప్రసంగాలతో మతపరమైన మైనారిటీల మీద, వారి ప్రార్థనా స్థలాల మీద హింసాత్మక దాడులను రెచ్చగొట్టారు. పౌరసత్వ సవరణ చట్టం, యూనిఫాం సివిల్ కోడ్, మతమార్పిడి వ్యతిరేక చట్టాలు, గోవధ నిషేధ చట్టాలతో భారతదేశపు న్యాయ స్వరూపాన్నే మార్చేసి మతపరమైన మైనారిటీలకు ప్రాతినిధ్యమే లేకుండా చేస్తున్నారు’’ అని ఆ నివేదిక తప్పుడు ఆరోపణలు చేసింది.