News

ధూప, దీప, నైవేద్య సాయం రూ.10 వేలకు పెంపు…

20views

ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు నిర్వహించేందుకు అందించే సాయాన్ని రూ.5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. దీని వల్ల 5,400 ఆలయాలకు ప్రతినెలా రూ.10 వేల చొప్పున అందనుంది. ఆదాయం లేని చిన్న ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు నిత్యం దీపం వెలిగించి, నైవేద్యం పెట్టేందుకు ధూప, దీప, నైవేద్యం పథకం (డీడీఎన్ఎస్) అమలు చేస్తున్నారు. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో తాజాగా సాయాన్ని రూ.10 వేలకు పెంచుతూ దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి ఎస్.సత్యనారాయణ ఉత్తర్వు జారీచేశారు. ఇందులో రూ.7 వేలు అర్చ కుడికి భృతిగా, రూ.3 వేలు ధూప, దీప, నైవేద్యానికి వినియోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనిని ప్రతినెలా అర్చకుడి ఖాతాలో ఆన్ లైన్ ద్వారా జమచేస్తారు. డీడీఎన్ఎస్ సాయం పెంచడంతో ఏడాదికి అదనంగా రూ.32.40 కోట్ల భారం పడనుంది. దీనిని దేవాదాయశాఖకు చెందిన సర్వ శ్రేయో నిధి (సీజీఎఫ్) నుంచి వినియోగించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.