24
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం విజయనగరం పైడితల్లి అమ్మవారిని తొలేళ్లు, సిరిమానోత్సవం పర్వదినాల్లో భక్తుల కు ఉచిత దర్శనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో ఆ రెండు ప్రత్యేక దినాల్లో ఉచిత దర్శనంతో పాటు రూ.100, రూ.300 రూ.50 వంతున టికెట్ల అమ్మకం ద్వారా దేవాలయానికి సుమారు రూ.15 లక్షల ఆదాయం వచ్చేదన్నారు. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉచిత దర్శన సదుపాయం కల్పించిందన్నారు. అక్టోబర్ 15న జరిగే సిరిమానోత్సవం నాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను మంత్రి శ్రీనివాస్ సమర్పించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.సత్యనారాయణ జీఓ నంబర్ 656 జారీ చేసినట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓ ప్రకటనలో తెలిపారు.