తిరుపతి శ్రీవారి లడ్డూ చుట్టూ ప్రస్తుత వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీలోని మంకామేశ్వర్ ఆలయం కీలక నిర్ణయం తీసుకున్నది. భక్తులు బయటి నుంచి తీసుకువచ్చే ప్రసాదాలపై నిషేధం విధిస్తూ ఆ ఆలయం నిర్ణయం తీసుకున్నది. కేవలం ఇంట్లో తయారు చేసిన ప్రసాదాలను కానీ, పండ్లను మాత్రమే ఆలయంలో నైవేద్యంగా సమర్పించాలని మంకామేశ్వర్ ఆలయ మహంతి దేవ్య గిరి తెలిపారు. తిరుపతిలో కలుషిత ప్రసాదాన్ని సరఫరా చేయడం క్షమించరాని నేరమని మహంతి పేర్కొన్నారు.
తిరుపతి ప్రసాదం వివాదం నేపథ్యంలో.. భక్తులు తాము తీసుకువచ్చే ప్రసాదాలను మాంసాహార పదార్ధాలతో తయారీ చేయరాదు అని ఆమె తెలిపారు. ఇంట్లో తయారు చేసిన నెయ్యి లేదా డ్రై ఫ్రూట్స్ లేదా పండ్లను తీసుకురావాలని గిరి వెల్లడించారు. దేవునికి సమర్పించే ప్రసాదాల్లో జంతు పదార్ధాలను వాడడం సనాతన ధర్మంపై దాడి చేయడమే అని, తిరుమలలో ఆ నేరానికి పాల్పడిన వ్యక్తలకు మరణశిక్ష విధించాలని మహంతి గిరి అభిప్రాయపడ్డారు.