News

తిరుమలలో ఆ మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు

42views

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈనెల 15 నుంచి 17వ తేదీల్లో ప‌విత్రోత్సవాలుపలు సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆగ‌స్టు 14న అంకురార్పణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను, 15న తిరుప్పావడ, 15 నుండి 17వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ర‌ద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఆగ‌స్టు 14న అంకురార్పణ పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.

ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శన‌మిస్తారని చెప్పారు. ఆగ‌స్టు 15న పవిత్రాల ప్రతిష్ట, 16న పవిత్ర సమర్పణ, 17న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నామని వివరించారు.