ArticlesNews

ఆకలి తీర్చే అమ్మ.. డొక్కా సీతమ్మ

81views

మధ్యాహ్న భోజన పథకానికి స్ఫూర్తి ప్రదాత పేరు

జననం: 1841 అక్టోబరు
మరణం: 1909 ఏప్రిల్‌ 28

పేదల ఆకలి తీర్చే ఆహారశాలలను రాజకీయ కక్షతో మూసివేయించే రోజులివి. అన్నార్తుల ఆకలికేకలు పట్టని పాలకులను చూస్తున్న కాలమిది. అలాంటిది.. పగలు, రాత్రీ తేడా లేకుండా ఆకలి అంటూ తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి కడుపు నింపిన గొప్ప మనసు డొక్కా సీతమ్మది. ఆస్తులు కరిగిపోయినా, కష్టాలు కుంగదీసినా, చరమాంకం వరకు నిత్యాన్నదానం కొనసాగించారు ఆమె. అన్నంపెట్టే అమ్మగా చరిత్రలో నిలిచిపోయారు. ఇదీ ఆ మహాతల్లి గొప్పదనం. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం విశేషం.

పల్లె ఖ్యాతి.. విశ్వవ్యాప్తి
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేట వాస్తవ్యులు అనప్పిండి భవానీశంకరం, నరసమ్మ దంపతులకు 1841 అక్టోబరులో సీతమ్మ జన్మించారు. పి.గన్నవరం మండలం లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న ఆ రోజుల్లో వేదసభలకు వెళ్తూ మండపేటలో భవానీశంకరం ఇంటివద్ద ఆగిన క్రమంలో సీతమ్మ ఆతిథ్యానికి ఆనందించి, 1850లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఎంతమంది వచ్చినా మాతృవాత్సల్యంతో సీతమ్మ భోజనం పెట్టేవారు. పిఠాపురం మహారాజు, మంత్రి బాటసారుల్లా మారువేషంలో వచ్చి తిన్నారని చెబుతుంటారు. డొక్కా దంపతులు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళుతున్నప్పుడు మార్గమధ్యలో ఓ పెళ్లిబృందం సీతమ్మ ఇంటికి వెళ్దామని మాట్లాడుకోవడం విని.. దైవదర్శనానికి వెళ్లకుండా ఇంటికొచ్చేశారు. ఆ బృందానికి భోజనం పెట్టి పంపారు.

డొక్కా సీతమ్మ సేవలను గుర్తించిన అప్పటి రాజులు, బ్రిటిష్‌ చక్రవర్తులు ఆమెను సన్మానించాలని ఆహ్వానిస్తే, సున్నితంగా తిరస్కరించేవారని గోదావరి జిల్లాల్లో చెప్పుకొంటారు. కింగ్‌ ఎడ్వర్డ్‌- 7 పట్టాభిషేక వేడుకకు భారతదేశంలోని అతిథులతోపాటు డొక్కా సీతమ్మనూ రాణి ఆహ్వానించారు. ఆమె సున్నితంగా తిరస్కరించడంతో సీతమ్మ చిత్రపటాన్ని తెప్పించుకుని, పట్టాభిషేక వేడుక చేసుకున్నారని చెబుతారు.
ఆమె జ్ఞాపకాలు

ఆమె నివాసంలో డొక్కా సీతమ్మ జ్ఞాపకాలు నేటికీ పదిలంగా ఉన్నాయి. ఆమె వాడిన కుర్చీ, బోషాణం, సన్నికల్లు, రుబ్బురోలు, పెరట్లో గిలక బావి ఇప్పటికీ కనిపిస్తాయి. సీతమ్మ నివాసం వాస్తవ రూపం చెడిపోకుండా ఆమె వంశీకులు 2013లో బాగుచేయించారు.

ప్రశంసాపత్రం,సేవలకు గుర్తింపు
1903 జనవరి 1న అప్పటి మద్రాసు ప్రభుత్వం ఆమెకు ప్రశంసాపత్రాన్ని ఇచ్చింది. భారతదేశ ఏడో బ్రిటిష్‌ చక్రవర్తి ఎడ్వర్డ్‌ పేరు మీద మద్రాసు ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరి జి.స్టోక్స్‌ ఈ ప్రశంసాపత్రాన్ని అందించారు.

పి.గన్నవరం వద్ద వైనతేయ గోదావరిపై నిర్మించిన అక్విడక్ట్‌కు ప్రభుత్వం డొక్కా సీతమ్మ అక్విడక్ట్‌గా పేరుపెట్టింది.ఆమె చరిత్ర ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లోనూ చేరింది.