News

బాలరామునికి బంగారు, వెండి కానుకల వెల్లువ

43views

అయోధ్యలో కొలువైన బాలరాముని దర్శనానికి వచ్చిన భక్తులు స్వామివారికి అత్యంత విలువైన కానుకలు సమర్పిస్తున్నారు. బాలరాముడు ప్రతిరోజూ భక్తుల నుంచి కానుకలతోపాటు భారీ మొత్తంలో విరాళాలను కూడా అందుకుంటున్నాడు. బాలరామునికి భక్తుల నుంచి పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు కానుకలుగా అందుతున్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు ట్రస్ట్ ద్వారా ఇద్దరు సంఘ్ కార్యకర్తలు నియమితులయ్యారు. వీరు ఆభరణాలను విరాళంగా ఇచ్చే భక్తుల పేర్లు, చిరునామా, మొబైల్ నంబర్‌ను నమోదు చేస్తుంటారు. వీరు షిఫ్టుల వారీగా పనిచేస్తుంటారు. భక్తుల నుంచి అందిన ఆభరణాలను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్‌లో జమచేస్తారు.

భక్తులు విరాళాల కౌంటర్ వద్ద సమర్పించే నగదును కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారు. రామ్ లల్లా ఆభరణాలకు రక్షణ అందించేందుకు రిటైర్డ్‌ ఆర్మీ జవానును నియమించారు. ఆయన ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో రామ్ లల్లాను అలంకరించినప్పుడు లాకర్ నుండి నగలను తీసి, సంబంధిత పూజారులకు అందిస్తారు. తిరిగి రాత్రిపూట వాటిని భద్రపరుస్తారు. ఆభరణాలకు రక్షణగా ఇద్దరు గన్నర్లు రోజుకు మూడు షిఫ్టుల్లో కాపలాగా ఉంటారు. ఆలయంలో భద్రత కల్పించేందుకు 20 మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని నియమించారు.