News

స్పష్టమైన యోజన దిశగా విద్యా భారతి వర్షారంభ సమావేశాలు

82views

స్పష్టమైన యోజన, చర్చల ద్వారానే మెరుగైన ఫలితాలు సాధించగలమని విద్యా భారతి అఖిల భారతీయ ప్రచార ప్రభారీ లింగం సుధాకర్ రెడ్డి వెల్లడించారు. అందుకే, విద్యా భారతి ప్రతి సంవత్సరం స్పష్టమైన యోజన దిశగా వర్షారంభ సమావేశాలను నిర్వహిస్తుందని తెలిపారు. విద్యా భారతి ఆంధ్రప్రదేశ్ ప్రాంత స్థాయి వర్షారంభ సమావేశాలను ఈ నెల 13, 14 తేదీలలో వరుసగా రెండు రోజుల పాటు అనంతపురంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా సమగ్ర విద్యా వికాసం కోసం కృషి చేస్తున్న విద్యా భారతి 28 అంశాలను ఆధారంగా చేసుకొని పని చేస్తోందని వివరించారు.

ఈ సమావేశాల్లో పంచ కర్తవ్యాలు ‘కుటుంబ ప్రబోధనం’, ‘సామాజిక సమరసత’, ‘పర్యావరణ పరిరక్షణ’, ‘నాగరిక కర్తవ్యం’, ‘స్వ’ భావన వ్యాప్తి పై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా భారతికి అనుబంధంగా పని చేస్తున్న సమితుల నుంచి ప్రధాన ఆచార్యులు, పాఠశాల కమిటీల ప్రబంధకులు, సమితి స్థాయి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చే విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన అంశాల మీద చర్చించారు. ఈ సందర్భంగా ‘విద్యా _సామాజిక చైతన్యం’ పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. పుస్తక పఠనంతో గొప్ప ఫలితాలు సాధించవచ్చని..విద్యార్థి దశ నుంచే పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూచించారు.

ఈ సమావేశాలకు విద్యా భారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించి పర్యవేక్షించారు. పాఠ్య ప్రణాళిక, విస్తరణతో పాటుగా వివిధ ఆయామ్‌లకు సంబంధించిన ప్రగతిని సమీక్షించారు. రాయలసీమ సమితి అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, విద్యా భారతి ప్రాంత కార్యదర్శి ప్రతాప్ సింహ శాస్త్రి, సంఘటన మంత్రి కన్నా భాస్కర్, శైక్షణిక్ ప్రముఖ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్.ఎస్.ఎస్. ప్రాంత కార్యవాహ్ వేణుగోపాల్ నాయుడు ప్రతినిధులకు మార్గదర్శనం చేశారు. సమారోప్(ముగింపు) కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్షేత్ర కార్యదర్శి ఆయాచితుల లక్ష్మణరావు, ప్రశిక్షణ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ పాల్గొని విద్యా సంబంధిత విషయాల పై పలు సూచనలు అందించారు. సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్.ఎ. కురి, అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీ ఛైర్మన్ అనంత రాముడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.