News

భక్తిశ్రద్ధలతో సావిత్రి అమావాస్య పూజలు

71views

శ్రీకాకుళం జిల్లా పలాస రూరల్‌ మండలంలోని తర్లాకోట, పండాశాసనం, బ్రాహ్మణతర్లా, రెంటికోటల్లో గల ఒడియా బ్రాహ్మణ మహిళలు గురువారం వైశాఖ అమావాస్య పురస్కరించుకుని సావిత్రి అమావాస్య పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు. పతి సౌభాగ్యం కోరుతూ జరిపే పూజల్లో ప్రధాన పూజగా సావిత్రి అమావాస్య పేరొందిన విషయం విదితమే. మామిడి, ఈత, తాటి ముంజెలు, పనసపళ్లతోపాటు పిండివంటలను నైవేద్యంగా సమర్పించి సావిత్రి కథను చదివి మహిళలు పూజలను జరిపారు. అనంతరం మహిళలు ఒకరినొకరు వాయినాలను అందజేశారు. అలాగే పలాస- కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలోగల 11వ వార్డు బృందావన చంద్ర ఆలయం, రాధాకాంత ఆలయం, పెద్ద,చిన్న బ్రాహ్మణవీధుల్లో ఒడియా మహిళలు భక్తిశ్రద్ధలతో సావిత్రి అమావాస్య పూజలను నిర్వహించి సతీసావిత్రి కథను చదివి వినిపించి ఒకరినొకరు వాయినాలను అందజేశారు.