News

అమర్ నాథ్ యాత్రకు హెలికాఫ్టర్ సేవలకు బుకింగ్ ప్రారంభం

82views

అమర్నాథ్ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హెలికాఫ్టర్ సేవలు జూన్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌ బుకింగ్ చేసుకోవచ్చని యాత్రికులకు జమ్ము కశ్మీర్ అధికార వర్గాలు గురువారం స్పష్టం చేశాయి. అయితే ఈ హెలికాఫ్టర్ సర్వీస్ రేట్లను త్వరలో విడుదల చేస్తామని తెలిపాయి.

అలాగే అమర్నాథ్ యాత్ర సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించాయి. ఆ క్రమంలో బల్‌‌టల్- దోమెల్ మార్గంలో భారీగా పేరుకుపోయిన మంచును బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ సిబ్బంది ఇప్పటికే కొంత తొలగించిందని.. అయితే ఆ మార్గాన్ని మరి కొంత బాగు చేయాల్సి ఉందని తెలిపాయి. ఈ పనులన్నీ కొద్ది రోజుల్లో పూర్తికానున్నాయని స్పష్టం చేశాయి. ఈ యాత్రలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా అన్నీ పనులు పూర్తి చేయాలని వివిధ విభాగాల అధిపతులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 29వ తేదీన ప్రారంభం కానుంది. ఆగస్ట్ 19వ తేదీతో ఈ యాత్ర ముగియనుంది. అంటే మొత్తం 52 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. మరోవైపు ఈ అమర్నాథ్ యాత్రలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. అయితే ఈ యాత్రలో పాల్గొనే భక్తులు.. పేర్ల నమోదు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండే ఉండేలా శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డ్ ప్రత్యేక చర్యలు చేపట్టింది.