News

అంతరిక్షంలోకి భారత్‌ సరికొత్త ‘అగ్నిబాణ్‌’..

83views

ప్రపంచ అంతరిక్ష మార్కెట్లను ఒడిసిపట్టేలా భారత్‌ మరో కీలక ముందడుగు వేసింది. ప్రత్యేకశ్రేణి ఉపగ్రహాలను వీలైనంత వేగంగా.. కారు చౌకగా కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రయోగం చేపట్టింది. చెన్నై ఐఐటీ కేంద్రంగా పనిచేసే అగ్నికుల్‌ సంస్థ ‘అగ్నిబాణ్‌’ పేరిట తొలిసారి సబ్‌-ఆర్బిటాల్‌ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్‌ ప్రయోగాన్ని నిర్వహించింది. గురువారం ఉదయం 7.15 గంటల సమయంలో దీనిని ప్రయోగించినట్లు ఇస్రో ప్రకటించింది. ఇందులో తొలిసారి సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ లిక్విడ్ ఇంజిన్‌ కంట్రోల్డ్‌ ఫ్లైట్‌ నిర్వహించినట్లైంది. ఇస్రో ఛైర్మన్‌ సోమ్‌నాథ్‌ కూడా అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థను అభినందించారు.

ఏమిటీ పరీక్ష..
ఈ ప్రయోగం దాదాపు రెండు నిమిషాలపాటు సింగిల్‌ స్టేజ్‌లోనే జరిగింది. దీనిలో ప్రపంచంలోనే తొలిసారి తయారుచేసిన సింగిల్‌పీస్‌ త్రీడీ ప్రింటెడ్‌ సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ను అమర్చారు. దీనిపై అగ్నికుల్‌ కాస్మోస్‌కు పేటెంట్‌ ఉంది. ఇది సబ్‌కూల్డ్‌ ద్రవ ఆక్సిజన్‌ ఆధారంగా ఒక స్టేజిలోనే పనిచేసింది. ఈ వ్యవస్థను పూర్తిగా దేశీయంగానే అభివృద్ధి చేశారు.

తొలి ప్రైవేటు లాంచ్‌ ప్యాడ్‌పై ప్రయోగం రెండు నిమిషాలే..
ఈ మొత్తం ప్రయోగం దాదాపు రెండు నిమిషాలు మాత్రమే జరిగింది. ముగిశాక రాకెట్‌ సముద్రంలో కూలిపోయింది. శ్రీహరి కోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌సెంటర్‌లో ఏర్పాటుచేసిన తొలి ప్రైవేటు లాంచ్ ప్యాడ్‌ ఏఎల్‌పీ-01 (ALP-01) ఈ పరీక్షకు వేదికైంది.

ఈ ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర మంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌ అగ్నికుల్‌ సంస్థను అభినందించారు. ప్రపంచంలోనే తొలిసారి 3డీ ప్రింటెడ్‌ రాకెట్‌ ఇంజిన్‌ను కావడం విశేషమన్నారు.