యాదాద్రి భక్తులకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఉన్నతాధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. స్వామి వారి దర్శనంతోపాటు ఆర్జిత సేవలు ఇకపై ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని భక్తులకు తెలిపారు. స్వామి వారిని దర్శించుకొనేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు యాదాద్రికి తరలి వస్తున్నారని… ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఆ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం తీసుకు వచ్చిన సౌకర్యాలన్నీ యాదాద్రిలో తీసుకు వస్తామని స్పష్టం చేశారు. అందులోభాగంగానే ఆన్లైన్ సేవలు తీసుకు వచ్చామని వివరించారు. ఆన్లైన్లో yadadritemple.telangana.gov.in. వెబ్సైట్లోకి వెళ్లి.. టికెట్లు బుక్ చేసుకోవచ్చని భక్తులకు సూచించారు. ఇక ఇదే వెబ్సైట్ నుంచి ఈ హుండీకి విరాళాలు ఇవ్వ వచ్చునని భక్తులకు తెలిపారు. ఆన్లైన్ ద్వారా గంట ముందు స్వామి వారి దర్శనం, పూజ కైంకర్యాలకు బుక్ చేసుకో వచ్చని యాదాద్రి దేవస్థానం ఉన్నతాధికారులు వివరించారు.