తరిగొండ వెంగమాంబ తన రచనల ద్వారా భావితరాలకు ఎనలేని సాహిత్య సంపదను అందించిందని జేఈఓ శ్రీమతి గౌతమి ఉద్గాటించారు. శ్రీవారి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు మంగళవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, తరిగొండ వెంగమాంబ శ్రీవారిపై భక్తి శ్రద్ధలతో అనేక సంకీర్తనలు రచించారన్నారు. వెంగమాంబ సాహిత్యాన్ని, రచనలు, కీర్తనలను జన బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు టీటీడీ కృషి చేస్తోందన్నారు. ముత్యాల హారతి రూపంలో శ్రీవారిలో ఐక్యమైనారన్నారు.
అనంతరం జరిగిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన అనంతపురం ఎస్కె వర్సిటీ మాజీ ఉపకులపతి డా.కుసుమకుమారి మాట్లాడుతూ, వెంగమాంబ ఎన్నో రచనలు చేసినా ఆమె రచనలకు గుర్తింపు రాలేదన్నారు. టీటీడీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఆమె సాహిత్యాన్ని, రచనలను వెలుగులోకి తీసుకొని వచ్చిందని చెప్పారు. సంఘసంస్కర్తగా, భక్తిని ఆయుధంగా చేసుకొని ఎన్నో రచనలు చేశారని వివరించారు.