News

ఊరంతా సుంకులమ్మ, ముత్యాలయ్యలే

104views

ఏ పల్లెలోనైనా ఒకే పేరు ఉన్న వారు ఐదారు మంది ఉంటే గొప్ప. అలాంటిది ఆ ఊళ్లో దాదాపు వెయ్యి మందికి పైగా ఒకే పేరు పెట్టుకున్నారు. సుంకులమ్మ అనో..ముత్యాలయ్య అనో. తమ ఇలవేల్పును నిత్యం స్మరించేలా ఇలా గ్రామ దేవతల పేర్లు పెట్టామని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంతకు ఆ గ్రామం ఏదంటే…పామిడి మండలం రామరాజుపల్లి. గ్రామంలో 400 కుటుంబాలకు గాను 1,600 మంది జనాభా ఉన్నారు. వీరిలో ఓ వెయ్యి మందికి ముత్యాలయ్య, ముత్యాలరెడ్డి, ముత్యాలమ్మ పేర్లు ఉన్నాయి. అలాగే మరో 400 మందికి సుంకులమ్మ, సుంకిరెడ్డి, సుంకన్న తదితర పేర్లు ఉన్నాయి.

అక్కాతమ్ముళ్లుగా జన్మించి…
రామరాజుపల్లి గ్రామం ఏర్పడినప్పుడు రెడ్ల సామాజిక వర్గానికి చెందిన గణేశం వంశంలో సుంకులమ్మ, ముత్యాలయ్య అక్క, తమ్ముడిగా జన్మించారు. దైవాంశసంభూతులైన వారి మహిమతో గ్రామం సస్యశ్యామలంగా ఉంటూ వచ్చింది. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చిన వారు తీరుస్తూ వచ్చారు. దీంతో స్థానికులు వారిని గ్రామ దేవతలుగా ఆరాధించేవారు. కాలక్రమేణ వారు అంతర్థానమైన తర్వాత గ్రామంలో ఆలయాన్ని నిర్మించి, నిత్య పూజలు చేస్తూ వస్తున్నారు. దాదాపు 250 సంవత్సరాలుగా రామరాజుపల్లిలో సుంకులమ్మ, ముత్యాలయ్య తిరునాలను ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ తిరునాలకు జిల్లా వాసులతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. రామరాజుపల్లిలో ఈ నెల 22వ తేదీ గ్రామదేవత తిరునాల ప్రారంభం కానుంది.