News

బాలికతో వేంకటరమణుడి నిశ్చితార్థం

75views

రాయదుర్గంలో ప్రతి ఏటా బాలికతో ప్రసన్న వేంకటరమణుడి కల్యాణోత్సవాన్ని జరపటం అరవా తెగకు ఆనవాయితీగా వస్తోంది. పట్టణంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో పురప్రముఖులు, దేవాదాయశాఖ అధికారులు, భక్తుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పట్టణానికి చెందిన రమేష్, జయమ్మల కుమార్తె మౌనిక(10)తో శ్రీవారి నిశ్చితార్థం చేశారు. ఈనెల 25న ఉదయం 11గంటలకు పట్టణంలోని స్వామివారి ఆలయంలో ప్రజల సమక్షంలో శ్రీదేవి, భూదేవిలతో పాటు బాలికతోనూ వేంకటేశ్వరుడి ఉత్సవ విగ్రహంతో కల్యాణం చేయనున్నారు. స్వామివారి తరఫున ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలాక్షిరెడ్డి, దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మేళతాళాలతో ఊరేగింపుగా కుమార్తె ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అలంకరించిన మౌనికను తల్లిదండ్రులు, బంధువులతో ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకువచ్చి, అర్చకులు బాలికతో వేంకటరమణుడి(కలశం)తో నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థం అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్ళారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు శివప్ప, కార్యదర్శి నాగప్ప, ఆసంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.