
సాధారణంగా భూమిలో బోరు వేస్తే నీళ్లు ఉబికి వస్తాయి. కానీ చెట్టును నరికితే నీళ్లు ఉబికి రావడాన్ని ఎప్పుడైనా చూశారా. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా, మీరు వింటున్నది నిజమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ అరుదైన సన్నివేశం కనిపించింది. ఒక చెట్టు మొదలు భాగం నరుకుతుండగా, ఒక్కసారిగా నీరు ఉబికి వచ్చింది. పాపికొండల నేషనల్ ఫారెస్ట్ పరిధిలోని కింటుకూరు ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ శాఖ అధికారుల పరిశీలనలో ఈ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది.
అక్కడ నల్ల మద్ది చెట్టు నుంచి నీళ్లు చుక్కలు, చుక్కలుగా రావడాన్ని గమనించిన అధికారులు, వెంటనే చెట్టు బెరుడును నరకగా, మొదలు భాగం నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. అలా వచ్చిన జలధార చూసిన ఫారెస్ట్ అధికారులు అవాక్కయ్యారు. ఆ చెట్టు నుంచి దాదాపు ఇరవై లీటర్ల వరకు నీరు వస్తుందని చెబుతున్నారు. చెట్టు నుంచి వచ్చిన నీళ్లను అటవీ శాఖ అధికారులు తాగారు. ఈ చెట్టును జలధార వృక్షంగా వారు చెబుతున్నారు.
అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జల ధార వృక్షం
పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులను కనివిప్పు చేసిన నల్లమద్ది చెట్టు.
నల్లమద్ది చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడి. pic.twitter.com/5C7qmYB6an
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2024
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అల్లూరి జిల్లా రంపచోడవరం – కింటుకూరు అటవీ ప్రాంతంలో నల్ల మద్ది చెట్లు వేలాదిగా ఉన్నాయి. కొన్నింటిలోనే నీటిని నిలువ చేసుకునే వ్యవస్థ ఉంది. నల్ల మద్ది చెట్టు 20 లీటర్ల స్వచ్ఛమైన నీరు నిల్వ చేసుకుంటుంది. గోదావరీ నదీ పరివాహక ప్రాంతాల్లోనూ అటవీ ప్రాంతంలో విరివిగా ఈ నల్ల మద్ది చెట్లు ఉన్నాయి. వందల్లో ఒక చెట్టుకు మాత్రమే నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.




