
శ్రీశైలంలో మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాల నిర్వహణకు వారంలో ముహూర్తం ఖరారు చేయాలని దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆ వివరాలను తమ ముందు ఉంచాలని తేల్చిచెప్పింది. న్యాయస్థానం ఇచ్చిన గడువు తర్వాత కూడా.. ముహూర్తం పెట్టేందుకు ఏడు నెలల సమయం తీసుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఎవరిని, ఎప్పుడు సంప్రదించారు.. ఎంతమంది నుంచి సలహాలు తీసుకున్నారు.. వారు ఏ తేదీలు సూచించారు? తదితర వివరాలు చెప్పాలని కమిషనర్కు ప్రశ్నలు సంధించింది. ఇప్పటికే కొంతమంది పీఠాధిపతులు, ప్రముఖులను సంప్రదించామని.. మరికొందరిని కలిసి రెండు రోజుల్లో ముహూర్తం నిర్ణయిస్తామని కమిషనర్ బదులిచ్చారు. దీంతో వారంలో ముహూర్తం నిర్ణయించాలని ఆదేశిస్తూ.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది.





