News

పిట్స్‌బర్గ్‌లో కార్ల ర్యాలీ, రాముల వారి కల్యాణం

235views

శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని దేశ, విదేశాల్లోని భక్తులు తిలకించారు. రామనామస్మరణలో మునిగితేలారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ చిన్మయమిషన్ ఆధ్వర్యంలో జనవరి 21న కార్ల ర్యాలీ, శ్రీ సీతారామ కల్యాణ ఉత్సవం నిర్వహించారు.

చిన్మయ అమర్‌నాథ్ శివాలయం నుంచి 30 మైళ్ల దూరంలో ఉన్న చిన్మయ హనుమాన్ దేవాలయం వరకు ఈ కార్ల ర్యాలీ సాగింది. 141 కార్లతో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, చిన్నపిల్లలు, వృద్ధులు చలిని సైతం లెక్క చేయకుండా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో పిట్స్‌బర్గ్‌ రామనామస్మరణతో మార్మోగింది. జై శ్రీరామ్ అనే నినాదాలు ప్రతిధ్వనించాయి. ఊరేగింపు అనంతరం చిన్మయ సంజీవిని హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన కల్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. మహా ప్రసాద వితరణతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాలంటీర్స్, భక్తులకు టెంపుల్ కార్యవర్గం కృతజ్ఞతలు తెలియజేసింది.