News

బాలక్‌ రామ్‌ దర్శనం కోసం రెండో రోజూ భారీగా తరలివచ్చిన భక్తులు

259views

అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట అనంతరం రెండో రోజు.. నేడు (బుధవారం) బాలక్‌ రామ్‌ దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు అంటే (నిన్న) మంగళవారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఆలయాన్ని ఉదయం ఏడు గంటలకు తెరవనుండగా, తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు బారులు తీరారు.

ప్రాణ ప్రతిష్ట జరిగిన మర్నాడు అంటే మంగళవారం ఐదు లక్షల మంది భక్తులు బాలరాముని దర్శనం చేసుకున్నారు. రాత్రి 9 గంటల వరకు భక్తులు శ్రీరాముని దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. భద్రతా ఏర్పాట్లు సజావుగా సాగేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా మంగళవారం సాయంత్రం అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యకు తరలివస్తున్న భక్తులు బాలరాముని దర్శనం కోసం ఓపిక పట్టాలని సీఎం కోరారు.

ఇకపై రామాలయంలో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిరంతర దర్శనం ఉంటుందని జిల్లా యంత్రాంగం, శ్రీరామజన్మభూమి ట్రస్టు తెలిపింది. అయితే హారతి, భోగం కోసం సమయంలో దర్శనాన్ని కొద్దిసేపు నిలిపివేస్తున్నట్లు ట్రస్టు పేర్కొంది.

ప్రాణ ప్రతిష్ట అనంతరం సామాన్య భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించగా, తొలిరోజైన మంగళవారం నాడు ఐడు లక్షల మందికిపైగా భక్తులు తమ బాలరాముని దర్శించుకున్నారు. నేడు (బుధవారం) ఉదయం ఇప్పటికే 20 వేల మందికి పైగా భక్తులు దర్శనం కోసం క్యూలో ఉన్నారు. నేటి ఉదయం ప్రవేశ ద్వారం వెలుపల కిలోమీటరుకు పైగా భక్తుల క్యూలు కనిపించాయి. ఈ నేపధ్యంలో పోలీసులు, ఆలయ నిర్వాహకులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.