
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేళ న్యూయార్క్లో ఉన్న ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ ప్రాంతం రామనామ జపంతో మార్మోగింది. ప్రవాస భారతీయులు మన సంప్రదాయాలు ఉట్టిపడేలా భజనలు, కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు. కూడలిలోని విద్యుత్ బిల్బోర్డుపై రాముడి చిత్రాలను ప్రదర్శించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఇక్కడ లైవ్లో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ప్రవాస భారతీయులు టైమ్స్ స్క్వేర్ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి, శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు చేతబూని వేడుకలు చేసుకుంటున్నారు. మసాచుసెట్స్లోని వొర్సెస్టర్ నగర మేయర్ జో పెట్టీ హిందూ సమాజానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమై ఒంటి గంటకు ముగియనుంది. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు ఏడు వేల మంది పాల్గొననున్నారు. రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బహుళ అంచెల భద్రత కోసం వేల మంది పోలీసులను మోహరించింది.
* ఫ్రాన్స్లోని ప్రవాస భారతీయులు సైతం ప్యారిస్లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం ఈఫిల్ టవర్ వద్దకు చేరి జైశ్రీరామ్ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.





