News

మరోసారి భారత్‌పై కెనడా ప్రధాని అనుచిత వ్యాఖ్యలు

176views

ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు విషయంలో భారత్ పై కెనడా ప్రధాని మరోసారి నోరు పారేసుకున్నాడు. తన చేష్టలు, వ్యాఖ్యల కారణంగానే యాక్షన్ ప్లాన్ నుంచి భారత్ వెనకడుగు వేసిందంటూ బీరాలు పోయాడు. గతంలో భారత్ పై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునే క్రమంలో ట్రూడో తనకు తాను గొప్పులు చెప్పుకున్నాడు.

హౌస్ ఆఫ్ కామన్స్ లో తాను చేసిన ప్రకటన భారత్ కు అడ్డంకిగా మారడంతో పాటు కెనడా సురక్షిత ప్రదేశంగా ఉండేందుకు దోహదపడ్డాయన్నారు. సంవత్సరాంతం సందర్భంగా కెనడాలోని సీటీవీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రూడో, నిజ్జర్ హత్య విషయాన్ని ప్రస్తావించారు. నిజ్జర్ హత్య కేసులో భారతదేశానికి ఉన్న సంబంధాలు మీడియాకు లీకు అవుతుందనే సమాచారం ఉండటంతోనే తాను మాట్లాడాల్సి వచ్చిందన్న ట్రూడో, దేశంలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వానికి పట్టు ఉందని చెప్పేందుకు తన నిర్ణయం ఉపయోగపడిందని భాష్యం చెప్పారు.

కెనడాలో చాలా మంది అభద్రతా భావంలో ఉన్నారని, ముఖ్యంగా నిజ్జర్ హత్య తర్వాత సిక్కుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఇంకో ఘటనకు పాల్పడకుండా భారత్ ను అడ్డుకోవాలని భావించినట్లు చెప్పారు. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలను ఖండించిన భారత్, తమ దేశంపై మోపుతున్న నిందలకు ఆధారాలు అందజేయాలని కోరింది.