
టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, భగవత్శాస్త్ర పాంచరాత్ర ఆగమ సంరక్షణ సభ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబరు 1 నుండి 3వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల ఆస్థానమండపంలో అఖిల భారత భగవత్శాస్త్ర పాంచరాత్ర ఆగమ విద్వత్ సమ్మేళనం జరుగనుంది.
ఆలయ పూజావిధులతోపాటు నాట్య, శిల్ప, వైద్య, జ్యోతిష, పలు లౌకిక విషయాలను శ్రీ పాంచరాత్ర ఆగమం తెలియజేస్తోంది. దేవాలయ నిర్మాణం, దేవాలయ పునర్నిర్మాణం ఇతర వర్తమాన, భవిష్యత్ సమస్యల పరిష్కారం కోసం శ్రీ పాంచరాత్ర ఆగమాన్ని మార్గదర్శకంగా భావించేలా చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం.
ఈ కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు సదస్సులు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి నుండి ప్రముఖ పండితులు విచ్చేసి ప్రసంగిస్తారు. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ అధికారి శ్రీ కె.రాజగోపాల్రావు ఈ సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.





