
విశాఖ నుంచి నేరుగా ప్రసిద్దపుణ్యక్షేత్రం వారణాశికి ఇకపై వారానికి రెండు రోజుల రైలు అందుబాటులోకి రాబోతోంది.సంబల్పూర్-బనారస్-సంబల్పూర్ ఎక్స్ప్రెస్ సేవలను ఈనెల 22 నుంచి బలంగీర్-టిట్లాఘర్ , రాయగడ మీదుగా విశాఖపట్నం వరకు పొడిగించాలని క నిర్ణయించారు. సంబల్పూర్ నుండి విశాఖపట్నం వరకు రైలు సర్వీసుల పొడిగింపును రైల్వేశాఖా మంత్రి అశ్వని వైష్ణవ్ ఈనెల 20 న సాయంత్రం 4.30 గంటలకు సంబల్పూర్లో ప్రారంభించనున్నారు.దీంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రజల చిరకాల వాంఛను నెరవేరబోతోంది.
విశాఖపట్నం-బనారస్ ఎక్స్ప్రెస్ ఈనెల 22 నుండి ప్రతి బుధ, ఆదివారాల్లో ఉదయం 4 గంటల 20 నిమిషాలకు విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది, ఇది మరుసటి రోజు 09 గంటల 25 నిమిషాలకు బనారస్ చేరుకుంటుంది.తిరుగు దిశ రైలు బనారస్-విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఈనెల 23 నుంచి ప్రతి గురువారం సోమవారాల్లో మధ్యాహ్నం 3:00 గంటలకు బనారస్ నుండి విశాఖపట్నం వైపు బయలుదేరుతుంది, ఇది మరుసటి రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు విశాఖపట్నంచేరుకుంటుంది. ఈ సందర్భంగా వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ మాట్లాడుతూ సంబల్పూర్ నుండి విశాఖపట్నం వరకు రైలు పొడిగింపు ఉత్తరాంధ్ర, పశ్చిమ ఒడిశా దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్లోని అంతర్గత జిల్లాలకు బహుళ ప్రయోజనాలను అందిస్తుందన్నారు. ఇది కనెక్టివిటీని మెరుగుపరచడం వల్ల పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ వంటి కీలక రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణాన్ని సులభతరం చేస్తుందన్నారు.





