News

ఇంద్రకీలాద్రిపై కార్తీకశోభ… అమ్మవారికి గాజుల అలంకరణ

314views

ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో లోక కళ్యాణార్థం ఈ నెల 14 నుంచి వచ్చే నెల 12 వరకు కార్తీకమాస వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్తీక ఉత్సవాల్లో భాగంగా 15వ తేదీన కార్తీక శుద్ధవిధియ నాడు శ్రీదుర్గమ్మవారికి గాజుల అలంకారం వేడుక అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు.

ఈ వేడుక సందర్భంగా శ్రీఅమ్మవారితో పాటు దేవాలయ పరిసర ప్రాంగణంలో అలంకరిస్తారు. ఉదయం నాలుగు గంటల నుంచి అమ్మవారి గాజుల అలంకరణను భక్తులు దర్శించుకోవచ్చు. ఇక కార్తీకమాసంలో శ్రీఅమ్మవారి ప్రధానాలయంతో పాటు శ్రీనటరాజస్వామి దేవాలయంలో ఆకాశదీపం ఏర్పాటు చేయనున్నారు.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సహస్ర లింగార్చన, అనంతరం మహానివేదన ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి 11 వరకు చతుర్వేద పారాయణం జరగనుంది.

నవంబరు 26న కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6గంటల30 నిమిషాలకు కోటి దీపోత్సవం నిర్వహించనున్నారు. ప్రధానాలయంతో పాటు ఉపాలయాలు, ఘాట్‌రోడ్, కనకదుర్గానగర్ తదితర ఆలయ ప్రాంగణముల నందు అంత్యంత వైభవోపేతంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 27న గిరిప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.