News

అయోధ్య రాముడికి 8 అడుగుల బంగారు సింహాసనం.. ‘అక్షత పూజ’ కోసం 100 క్వింటాళ్ల బియ్యం

250views

ఉత్తరప్రదేశ్ అయోధ్య రామాలయ గర్భగుడిలో పాలరాతితో చేసి..బంగారు పూత పూయించిన 8 అడుగుల ఎత్తున్న సింహాసనాన్ని నెలకొల్పనున్నారు. ఈ పీఠంపై రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ బంగారు సింహాసనం ఎనిమిది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉంటుందని.. దీనిని రాజస్థాన్‌లోని హస్తకళాకారులు తయారు చేస్తున్నారని ఆలయ ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా మంగళవారం వివరించారు. డిసెంబర్ 15 నాటికి ఈ సింహాసనం అయోధ్యకు చేరుకుంటుందని ఆయన తెలిపారు. గర్భగుడి నిర్మాణం కూడా పూర్తయినట్లు మిశ్ర చెప్పారు.

డిసెంబర్ 15 కల్లా పూర్తి..
‘డిసెంబర్ 15 నాటికి రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. మొదటి అంతస్తులో 80 శాతం మేర పనులు పూర్తయ్యాయి. మొదటి అంతస్తులో 17 స్తంభాలు ఏర్పాటు చేయగా, మరో రెండింటి పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొదటి అంతస్తు పైకప్పు నిర్మాణం కూడా డిసెంబర్ 15 కల్లా పూర్తవుతుందని అనుకుంటున్నాం’ అని అనిల్ మిశ్ర పేర్కొన్నారు.

భక్తుల కోసం ప్రత్యేకంగా..
పరిక్రమ మార్గ్‌లోని ఫ్లోరింగ్‌ పనులు కూడా పూర్తయ్యాయని.. ప్రస్తుతం గృహ మండపం నేలపై మార్బుల్స్ వేసే పనులు కొనసాగుతున్నాయని అనిల్ మిశ్ర తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలోని మూడు అంతస్తుల్లో పైకప్పులు నిర్మించామని.. అలాగే మందిరం ప్రవేశ ద్వారం వెలుపలి గోడ(పార్కోట) పనులు కూడా చివరి దశలో ఉన్నాయని ట్రస్ట్ తలిపింది. ఇది కూడా నవంబర్ చివరినాటికి పూర్తవుతుందని ట్రస్ట్ సభ్యుడు మిశ్ర చెప్పారు.

మరోవైపు, భక్తులు రాముడి కోసం పెద్ద మొత్తంలో బంగారం, వెండి వస్తువులను విరాళంగా ఇచ్చారని.. వాటిని నిల్వ చేయడం కాస్త కష్టం కాబట్టి వాటిని కరిగిస్తామని మిశ్ర వివరించారు. పేరున్న జ్యువెలరీ సంస్థ ఆధ్వర్యంలోనే ఈ పనులు జరుగుతాయని ఆయన తెలిపారు.

‘అక్షత పూజ’ కోసం 100 క్వింటాళ్ల బియ్యం..!
100 Quintal Rice For Akshat Pooja : మరోవైపు, నవంబర్ 5న ఆలయంలో నిర్వహించే ‘అక్షత పూజ’ కోసం 100 క్వింటాళ్ల బియ్యాన్ని ఆర్డర్ చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. అలాగే బియ్యం(అక్షతల్లో)లో కలిపేందుకు ఒక క్వింటాల్ పసుపుతో పాటు దేశీ నెయ్యికి కూడా ఆర్డర్ ఇచ్చారు. ఇలా కలిపిన బియ్యాన్ని ఇత్తడి కలశాల్లో నింపి పూజ సమయంలో రాముడి విగ్రహం ముందు ఉంచనున్నారు. ఇలా పూజలో వినియోగించిన అక్షతలను విశ్వ హిందూ పరిషత్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులకు పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

రెండు కోట్ల కరపత్రాలు..
Ayodhya Ram Mandir Opening Date: ఆలయ ఓపెనింగ్కు సంబంధించి వివిధ రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో రెండు కోట్లకు పైగా కరపత్రాలను ముద్రించింది ట్రస్ట్. ఈ కరపత్రాలతో పాటు పూజించిన అక్షతలను దేశంలోని ప్రతిఇంటికి పంపనున్నారు. ఇక నవంబర్ 5న అయోధ్యలో జరిగే పూజకు వీహెచ్‌పీ ప్రతినిధులను ఆహ్వానించామని ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.

“ఒక్కో వీహెచ్పీ ప్రతినిధికి ఐదు కేజీల చొప్పున బియ్యం ఇస్తాము. వీటికి తమ ప్రాంతాల్లోని దేవాలయాల్లో పూజలు చేస్తారు. అనంతరం వాటిని జిల్లాల ప్రతినిధులకు అందజేస్తారు. అలా బ్లాక్లు, మండలాలు, గ్రామాల్లోని ప్రజలకు శ్రీరాముడి అక్షతలను పంపిణీ చేస్తారు. 2024 జనవరి 1 నుంచి 15 వరకు దేశంలోని ఐదు లక్షల గ్రామాల్లో పూజించిన ఈ అక్షతలను పంపిణీ చేయనున్నాం.”
– చంపత్ రాయ్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కార్యదర్శి

‘లైవ్ ద్వారా ఆలయ ప్రారంభోత్సవం వీక్షించవచ్చు..’
దేశవ్యాప్తంగా ఉన్న రాముడి భక్తులు ప్రత్యక్షప్రసారం ద్వారా రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వీక్షించవచ్చని ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించింది. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లోని దేవాలయాల వద్ద ప్రత్యేకంగా పెద్ద ఎల్ఈడీ టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే భజనలు-కీర్తనలు చేసేలా కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఇక అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకను వివిధ ప్రాంతాల్లోని మఠాలు, దేవాలయాల్లో కూడా జరుపుకోవాలని ట్రస్టు సభ్యులు విజ్ఞప్తి చేయనున్నారు.