News

శబరిమల భక్తుల కోసం వందే భారత్ రైలు

377views

శబరిమల యాత్రికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వందేభారత్ ట్రైన్ ను చెంగనూర్ స్టేషన్ లో ఆపేందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వి మురళీధరన్ శుక్రవారం (అక్టోబర్ 20) సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. శబరిమల అయ్యప్ప భక్తులను దృష్టిలో పెట్టుకొని చెంగనూరులో హాల్ట్‌ను మంజూరు చేసినట్లు తెలిపారు.

రైల్వే మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం కాసరగోడ్-తిరువనంతపురం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20633/20634) చెంగనూర్ లో ఆగుతుంది. చెంగనూరులో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ ను ఆపేందుకు అనుమతి కోరుతూ మురళీధరన్ గతంలో రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. చెంగనూరు రైల్వే స్టేషన్.. అలప్పుజా, కొల్లాం, పతనంతిట్ట , కొట్టాయం జిల్లాలకు సేవలందిస్తుందని.. దీనిని 2009లో భారతీయ రైల్వే ‘గేట్‌వే ఆఫ్ శబరిమల’గా ప్రకటించిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. శబరిమల …. దేశంలోని అత్యంత ముఖ్యమైన హిందూ యాత్రికుల కేంద్రాలలో ఒకటని ఆయన లేఖలో రాశారు. వందేభారత్ ట్రైన్ కు చెంగనూరులో స్టాపేజ్ పాయింట్ మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.