News

ఆ టిక్కెట్లు రద్దైనవారు టీటీడీ ఆఫర్‌ను వినియోగించుకోండి.. హైకోర్టు కీలక తీర్పు

270views

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రద్దుచేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆర్జిత సేవా టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు కొందరు డబ్బు వాపసు తీసుకోగా.. మరికొందరు టీటీడీ కల్పించిన అవకాశంతో శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే, కొంత మంది మాత్రం తమకు ఆర్జిత సేవలకే అవకాశం కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సింగిల్ జడ్జ్ ధర్మాసనం విచారణ చేపట్టి.. భక్తులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

ఈ తీర్పును టీటీడీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయగా.. సింగిల్ జడ్జ్ తీర్పు పక్కనబెట్టింది. కోవిడ్‌ సమయంలో ఆర్జిత సేవా టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులకు ప్రస్తుతం ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసినట్లు టీటీడీ ప్రకటనలో తెలిపింది. కరోనా సమయంలో ఆర్జిత సేవా టికెట్లు బుక్‌ చేసుకున్న మిగిలిన భక్తులకు టీటీడీ కల్పించిన సదుపాయాలనే మీరూ ఉపయోగించుకోవాలని పిటిషనర్లను ఆదేశించిందని పేర్కొంది. 2020 మార్చిలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శ్రీవారి దర్శనంతోపాటు మేల్‌చాట్‌ వస్త్రం, అభిషేకం వంటి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

ఆర్జిత సేవల్లో పాల్గొనలేకపోయిన భక్తులు కొందరు డబ్బులు వెనక్కి తీసుకోగా.. మరికొందరు టీటీడీ కల్పించిన దర్శన సదుపాయాన్ని వినియోగించుకున్నారు. అయితే, 16 మంది భక్తులు మాత్రం తమకు ఆర్జిత సేవకే అవకాశం ఇప్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. సేవలకు అవకాశం కల్పించాలని సింగిల్‌ జడ్జి టీటీడీ ఆదేశించారు. దీంతో ఈ తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు టీటీడీ అప్పీల్‌ చేసింది. ఇతర భక్తులు దశాబ్దాలకు ముందే ఆర్జిత సేవా టికెట్లు బుక్‌ చేసుకున్నందున.. వీరికి అవకాశం కల్పించలేమని ధర్మాసనానికి టీటీడీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ వివరించింది. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి సింగిల్‌ జడ్జి ఆదేశాలను కొట్టివేశారని టీటీడీ తెలిపింది. టీటీడీ ఇచ్చిన రెండు సదుపాయాల్లో ఏదో ఒకటి ఉపయోగించుకోవాలని పిటిషనర్లకు సూచించిందని పేర్కొంది.