News

యూకే, యూరప్‌లో వైభవంగా శ్రీవేంకటేశ్వరుడి కళ్యాణం

213views

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విదేశాల్లో శ్రీవేంకటేశ్వరస్వామి కళ్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ నెల 10 నుంచి 15వరకు స్వామి కళ్యాణాన్ని జరిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగసంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.యూకే, యూరప్ లో స్థిరపడిన హిందువుల కోసం టీటీడీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 15 వరకు తొమ్మిది నగరాల్లో శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి.

వైఖానస ఆగమం ప్రకారం తితిదే నుంచి వెళ్ళిన అర్చకులు, వేదపండితులు ఈ కల్యాణోత్సవాలను నిర్వహించారు. అన్ని నగరాల్లో శ్రీమలయప్ప స్వామివారి కల్యాణోత్సవానికి అశేష సంఖ్యలో ఎన్ఆర్ఐ భక్తులు ప్రత్యక్షంగా స్వామివారి కల్యాణాన్ని వీక్షించి పులకించారు.

గత 16 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 45 నగరాల్లో తిరుమల శ్రీవారి కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవాల్లో దాదాపు రెండు లక్షలకు పైగా ఎన్నారై భక్తులు పాల్గొన్నారు. తెలుగు, భారతీయ భక్తులతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న వారు కూడా అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణ ఘట్టాన్ని వీక్షించి ఆశీర్వాదాలు అందుకున్నారు.యూకే, యూరప్ దేశాలలోని వివిధ నగరాల్లో ఘనంగా జరిగిన శ్రీ మలయప్ప స్వామి వారి కల్యాణోత్సవాలపై ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ ఎస్. మేడపాటి హర్షం వ్యక్తం చేశారు.