News

మధ్యప్రదేశ్‌లో కూలిన జెట్ విమానాలు.. రాజస్థాన్‌లో శకలాలు లభ్యం!

272views

మధ్యప్రదేశ్‌లోని మొరేనా నగరంలో శనివారం కుప్పకూలిన రెండు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జెట్ విమానాల శకలాలు 100 కిలోమీటర్ల దూరం ఎగిరిపడ్డాయి. విమానాల శకలాల్లో కొన్నింటిని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో అధికారులు గుర్తించారు. భరత్‌పూర్-మొరేనా నగరాల మధ్య విమాన ప్రయాణ దూరం కొన్ని నిమిషాలే కావడం గమనార్హం.

కూలిన ఫైటర్ జెట్స్.. సుఖోయి ఎస్‌యూ-30, మిరేజ్ 2000 శకలాలను రాజస్థాన్‌లోని భరత్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని మొరేనాలలో గుర్తించినట్టు అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో విమానాలు కుప్పకూలాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ట్విట్టర్ ప్రకారం.. ఈ ప్రమాదాల్లో ఒక పైలట్ మృతి చెందాడు. గ్వాలియర్ సమీపంలో శనివారం ఉదయం రెండు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రమాదానికి గురయ్యాయి. సాధారణ ఆపరేషనల్ ఫ్లైయింగ్ శిక్షణలో ఉండగా విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. రెండు విమానాల్లో మొత్తం ముగ్గురు పైలట్లు ఉండగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు ఐఏఎఫ్ తెలిపింది.