
* 15 ఏళ్ల తెలుగు బాలుడి ఘనత
* చెన్నై నుంచి లండన్ కు సైకిల్ యాత్ర చెయ్యడమే లక్ష్యం
తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దకుండా, పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలంటూ 10వ తరగతి పూర్తిచేసిన తెలుగు బాలుడు 15 ఏళ్ల ఆశిష్ చెన్నై నుంచి లాడ్డాఖ్ రాజధాని లేహ్ వరకు సైకిల్ మీద సాహసయాత్ర చేశాడు.
కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన ఆశిష్ కుటుంబం వ్యాపారరీత్యా కొన్నేళ్ల కిందట చెన్నైలో స్థిరపడింది. సైక్లింగ్ పై ఆసక్తి ఉన్న ఆశిష్ జూలైలో చెన్నై నుంచి సైకిల్ పై బయలుదేరి 41 రోజుల్లోనే లేహ్ కు చేరుకున్నాడు.
సైకిల్ యాత్రను పూర్తిచేసి తిరుగుప్రయాణంలో ఢిల్లీకి చేరుకున్న ఆశిష్ సహా అతడి కుటుంబసభ్యులు ఏపీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఆశిష్ మాట్లాడుతూ సైకిల్ యాత్రలో మైదాన ప్రాంతంలో రోజూ 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చెప్పాడు. చండీఘడ్ నుంచి పర్వత ప్రాంత ప్రయాణం మొదలయ్యాక ప్రతికూల వాతావరణం, వర్షం కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడినా యాత్రను కొనసాగించినట్లు తెలిపాడు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాలన్నదే తన కల అని ఆశిష్ పేర్కొన్నాడు. తనపై తల్లిదండ్రులెప్పుడూ ఎలాంటి ఒత్తిడీ చేయలేదని, మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు. చెన్నై నుంచి లండన్ కు సైకిల్ యాత్ర చేయనున్నట్లు ఆశిష్ చెప్పాడు.





