
వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలు గత కొద్ది నెలల నుంచి అధికమౌతూనే ఉన్నాయి. పలు దఫాల చర్చలు విఫలమైన నేపథ్యంలో భారత్పై ఒత్తిడి పెంచేందుకు చైనా 2000 కి.మీ వరకు పరిధి గల లాంగ్ రేంజ్, సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులను తూర్పు లదాఖ్ ప్రాంతానికి తరలించింది. చైనా చేష్టలకు జవాబుగా భారత్ ముప్పేట దాడి చేసేందుకు బ్రహ్మోస్, నిర్భయ్, ఆకాశ్ క్షిపణులను ఈ ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది.
కాగా, వీటిలో 500 కి.మీ పరిధి గల బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని అత్యవసర పరిస్థితుల్లో చైనాపై ప్రయోగించే బ్రహ్మాస్త్రంగా భారత్ భావిస్తోంది. రష్యా సహకారంతో తయారుచేసిన బ్రహ్మోస్ క్షిపణులను భారత్ ‘తగిన’ సంఖ్యలో లద్దాఖ్ వద్దకు తరలించినట్టు తెలిసింది. ఇక ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే 800 కి.మీ పరిధి గల నిర్భయ్ సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణి 100 మీటర్ల నుంచి నాలుగు కి.మీ ఎత్తులో ఎగురుతూ నేలపై ఉన్న లక్ష్యాలను గుర్తించి, ఛేదించటంలో దిట్ట. కాగా, చైనా వాయు సేనను ఎదుర్కొనేందుకు వినియోగించనున్న ఆకాశ్ ఒకేసారి 64 లక్ష్యాలపై నిఘా ఉంచుతూ, వాటిలో పన్నెండింటిపై ఒకేసారి దాడిచేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది.





