
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా చికిత్స కోసం వెయ్యి పడకల ఆసుపత్రి సిద్ధమైంది. 12 రోజుల రికార్డు స్థాయిలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) నిర్మించింది. ఆసుపత్రిలో సాంకేతిక హంగులు, రోబోలతో సేవలు అందనున్నాయి. ఈ సందర్భంగా డీఆర్డీవో ఛైర్మన్ సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఆసుపత్రిలో ఆధునిక వంటగది ఏర్పాటు చేశామన్నారు. ప్రతి కరోనా బాధితుడికి రోబో ద్వారా ఆహారం అందిస్తామని చెప్పారు. కుటుంబసభ్యులకు కరోనా బాధితుడితో మాట్లాడేందుకు ఐప్యాడ్ సౌకర్యం కల్పించామన్నారు. రోగి బంధువులు ఉండేందుకు అన్ని సౌకర్యాలు సమకూర్చామని తెలిపారు. ఈ ఆసుపత్రిలో అన్ని సేవలు ఉచితమని పేర్కొన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి టాటా, భెల్ సంస్థలు సాయం చేశాయని వివరించారు. ఈసీజీ, ఎక్స్ రే, అల్ట్రా స్కానింగ్ ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. మాస్కులు, పీపీఈలు, వెంటిలేటర్లు, ఇతర సామగ్రి సమకూర్చామని తెలిపారు. పూర్తిగా స్వదేశీ పరికరాలతోనే ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్లు డీఆర్డీవో ఛైర్మన్ సతీశ్ రెడ్డి స్పష్టం చేశారు.





